Unlock 4.0 : లోకల్ లాక్డౌన్స్పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు...
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ మార్గదర్శకాలు అమలులో ఉండనున్నాయి. ఇందులో భాగంగా ఇకపై రాష్ట్రాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో సంప్రదించకుండా కంటైన్మెంట్జోన్ల బయట లోకల్ లాక్ డౌన్స్ విధించరాదు.
తాజా మార్గదర్శకాల ప్రకారం... కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. కంటైన్మెంట్ జోన్లను గుర్తించే నిర్ణయాధికారం జిల్లా అధికారులకే ఉంటుంది. ఈ జోన్లలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
జిల్లా కలెక్టర్లకు కేంద్రం ప్రత్యేక సూచన కూడా చేసింది. కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి జిల్లాల వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలని సూచించింది. కొత్త కంటైన్మెంట్ జోన్లు లేదా కంటైన్మెంట్ ఎత్తివేత వివరాలను కేంద్రానికి సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
అన్లాక్ 4.0లో రవాణా సౌకర్యాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అంతరాష్ట్ర,రాష్ట్రాల మధ్య ప్రయాణాలు,సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని పేర్కొంది. 65 ఏళ్లు పైబడ్డవారు,గర్భిణీ స్త్రీలు,ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య సేతు యాప్ వాడాలని సూచించింది.