క్షమించు బాపు.. గుజరాత్ లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం.. బీజేపీపై విమర్శలు
ఆయన.. అహింస మార్గంలో బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. జాతిపితగా ప్రజల మన్ననలు పొందారు. చనిపోయి దశాబ్ధాలు గడుస్తున్నా మహాత్మా గాంధీ ప్రాసంగిక వ్యక్తిగానే ఉండిపోయారు. కొన్నేళ్లుగా గాంధీజీ హత్య చుట్టూ రాజకీయ రాద్ధాంతం నడుస్తోంది. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్నవారిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అయినాకూడా గాంధీజీపై దాడులు ఆగడంలేదు.
మోదీ రాకతో విగ్రహానికి మెరుగులు
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లాలోని ప్రఖ్యాత హరికృష్ణ సరస్సుకు సమీపంలోని పార్కు దగ్గర ముక్కలుగా పగిలిపోయిన గాంధీ విగ్రహాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ధ్వంసమైన గాంధీ విగ్రహం దగ్గర్లోని పార్కును 2017లో ప్రధాని మోదీనే ప్రారంభించారు. ఆ టైమ్ లోనే విగ్రహానికి మెరుగులు దిద్ది కొత్తగా తయారుచేశారు.

వాళ్లే చేసుంటారా?
మోదీ ప్రారంభించినట్టుగా ప్రచారంలో ఉన్న విగ్రహంపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. సరస్సు వద్ద నిర్మాణాల్ని వ్యతిరేకిస్తోన్న ఆందోళనకారులే ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల వెర్షన్ పై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గాడ్సేను దేశభక్తుడిగా ప్రచారం చేస్తున్నందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీనికి బీజేపీనే బాధ్యత వహించాల్సిఉంటుందని గుజరాత్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ వ్యాఖ్యల్ని ఖండించారు.












Click it and Unblock the Notifications