రూ.2 లక్షలు ఇవ్వకపోతే.. పుల్వామా తరహా దాడి చేస్తా: యూపీలో టెన్త్ విద్యార్థి వార్నింగ్
తన దగ్గర శక్తిమంతమైన ఆర్డీఎక్స్ ఉందని, దానితో స్కూల్ బిల్డింగ్ ను పేల్చిపారేస్తానంటూ ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ ను బెదిరించిన వ్యవహారం తీవ్ర కలకం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుణ్ని అరెస్టు చేశారు. బరేలీ సీనియర్ ఎస్పీ శైలేంద్ర పాండే చెప్పిన వివరాలివి..
బరేలీ పట్ణణంలోని ఓ ప్రముఖ స్కూల్లో 400మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మొన్న ఆదివారం స్కూల్ ప్రిన్సిపల్ ఇంట్లోకి రెండు లెటర్లు వచ్చిపడ్డాయి. స్కూల్ బిల్డింగ్ లో ఆర్డీఎక్స్ అమర్చామని, పుల్వామా తరహాలో దాడి జరగబోతోందని, అలా జరగొద్దంటే రూ.2లక్షలు ఇవ్వాలని ఓ లేఖలో రాసుంది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే మీ(ప్రిన్సిపల్) ఇంటిని కూడా పేల్చేస్తామని మరో లేఖలో వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..
ప్రిన్సిపల్ ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ తో స్కూల్ బిల్డింగ్ అణువణువునూ తనిఖీ చేయించారు. ప్రిన్సిపల్ ఇంటిని కూడా నిశితంగా పరిశీలించారు. కానీ బాంబులేవీ దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంగళవారం మరో లేఖ రావడంతో మళ్లీ అందరూ భయభ్రాంతులయ్యారు. చివరికి నిందితుణ్ని పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

మూడో లెటరే పట్టించింది..
డబ్బులివ్వకుంటే స్కూల్ పేల్చేస్తామంటూ వచ్చిన మూడో లేఖ.. పోలీసుల పనిని మరింత సులభతరం చేసింది. సైన్స్ సబ్జెక్టు కోసం ఆ స్కూల్లోని తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు వాడే నోటు పుస్తకం నుంచి ఒక పేజీని చించి లేఖ రాసినట్లు పోలీసులు కనిపెట్టారు. వెంటనే ఆ రెండు తరగతులకు వెళ్లి.. విద్యార్థుల నోటు పుస్తకాలను చెక్ చేయగా.. రాసినవాడు దొరికిపోయాడు.

కేసు నమోదు..
డబ్బులివ్వకుంటే పుల్వామా తరహా దాడి చేస్తానంటూ స్కూల్ ప్రిన్సిపల్ ను బెదిరించిన ఆ పదో తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని 386, 507 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అతణ్ని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు బరేలీ సీనియర్ ఎస్పీ శైలేంద్ర పాండే వివరించారు.












Click it and Unblock the Notifications