చీఫ్ జస్టిస్పై సుప్రీం జడ్జిల సంచలనం, రంగంలోకి ప్రధాని మోడీ!
న్యూఢిల్లీ: నలుగురు సుప్రీం కోర్టు జడ్జిలు ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశ చరిత్రలో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఇది కలకలం రేపుతోంది. సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థపై జడ్జిలే సంచలన వ్యాఖ్యలు చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించారు.
Recommended Video
సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు, చీఫ్ జస్టిస్ వినలేదు: చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్మీట్
మోడీతో అత్యవసరంగా సమావేశం కావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ను పీఎంవో కోరింది. ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చిస్తారు. ఇప్పటికే వారు ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అటార్నీ జనరల్తో కలిసి మీడియా ముందుకు రానున్నారు.
ఏడు పేజీల లేఖలో తిరుగుబాటు
సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చీఫ్ జస్టిస్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు సీజే దీపక్ మిశ్రాకు ఏడు పేజీల లేఖను పంపించారు.
ఆ లేఖలో ఏముందంటే
ఆ లేఖలో ఏముందంటే, సుప్రీం కోర్టు వెలువరించిన కొన్ని తీర్పులు న్యాయవ్యవస్థ పని తీరు, హైకోర్టుల స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని తాము భావిస్తున్నామని వారు లేఖలో పేర్కొన్నారు.
హేతుబద్దంగా జరగడం లేదు
కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు హేతుబద్ధంగా జరగడం లేదని వారు పేర్కొన్నారు. కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు కొందరికి అనుకూలంగా జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ఎవరికీ ఎక్కువ కాదు, తక్కువ కాదు
సుప్రీం కోర్టు వ్యవస్థకు ఇబ్బందులు తీసుకు రాకుండా ఉండేందుకు వాటి గురించి తాము ఇక్కడ వివరాలను ప్రస్తావించడం లేదని, కానీ వాటి వల్ల సుప్రీం వ్యవస్థకు కొంత నష్టం జరిగిందని, సుప్రీం న్యాయమూర్తుల్లో సమానంగా ఉండే వారిలో ముందు ఉండే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అని, ఆయన ఎవరికీ ఎక్కువ కాదని, తక్కువ కాదన్నారు.