ఢిల్లీలో పట్టపగలు మహిళను కాల్చేసి, ఎస్సై సూసైడ్
ఢిల్లీ: 33 ఏళ్ల ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అతను తన 28 ఏళ్ల ఓ మహిళను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 4 ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
సదరు ఎస్సై పట్టపగలు అందరూ చూస్తుండగానే తన సర్వీస్ రివాల్వర్తో మహిళను కాల్చి చంపి, అదే తుపాకితో తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సదరు ఎస్సైని విజేంద్ర కుమార్గా గుర్తించారు. ఇతను రన్హౌలా పోలీసు స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నారు.
ఆయనకు భర్తతో విడిపోయిన నిఖిత చౌహన్ అనే మాజీ మాహిళా విలేకరితో సన్నిహిత సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఉద్యానవనానికి రావల్సిందిగా విజేంద్ర పిలవడంతో ఆమె అక్కడకు వచ్చారు.
అక్కడ ఒక బల్లపై కూర్చొని మాట్లాడుకుంటుండగా విజేంద్ర హఠాత్తుగా తన సర్వీస్ రివాల్వర్తో నిఖితపై కాల్పులు జరిపారు. దీంతో ఛాతీ, పొట్టలోకి మూడు తూటాలు దూసుకెళ్లి ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం అదే తుపాకితో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రత్యక్షసాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతన్ని ఎయిమ్స్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిఖిత... విజేంద్రను గతంలో బెదిరించి డబ్బులు రాబట్టుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లుగా పోలీసులు చెప్పారు. విజేంద్రకు ఆయన భార్యకు మధ్య కుటుంబ తగాదాలున్నాయని, ఆమె రాజస్థాన్లో అతనిపై గృహహింస చట్టం కింద కేసు పెట్టారని పోలీసులు తెలిపారు.