చైనా మాస్టర్ స్ట్రోక్ - మోదీకి మైండ్ బ్లాక్..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్నీ మధ్యే ఉజ్బెకిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. సమర్కండ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. భారత్తో పాటు పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ దఫా ఉజ్బెకిస్తాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ- రష్యా, చైనా, టర్కీ, ఇరాన్ అధ్యక్షులు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు.
కీలక భేటీ..
పరస్పర సహకారం, దౌత్య సంబంధాలు, వాణిజ్య-ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, ఇంధన వనరులు, ఆసియాలో ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ యుద్ధం వల్ల ఆసియా దేశాలు ఏ మేర నష్టపోతోన్నాయనే అంశంపై ఆయా దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని నేరుగా వ్లాదిమిర్ పుతిన్ వద్దే ప్రస్తావించారు.
టెర్రరిస్ట్ సాజిద్ మిర్..
ఆసియా దేశాల్లో అత్యంత కీలకంగా భావించే ఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లష్కరే తొయిబాకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది సాజిద్ మిర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి భారత్-అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనలకు అడ్డుపడింది. ఐక్యరాజ్య సమితి భద్రతమండలిలో ఈ ప్రతిపాదనలను ఆమోదించడానికి నిరాకరించింది డ్రాగన్ కంట్రీ.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా..
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సాజిద్ మిర్. పాకిస్తాన్ ప్రోత్సాహిత లష్కరే తొయిబాలో అత్యంత సీనియర్ హోదాలో పని చేస్తోన్నాడు. ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి ప్రధాన సూత్రధారి అతనే. సాజిద్ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ల జాబితాలో చేర్చింది భారత్. అమెరికా సైతం అతని కోసం గాలిస్తోంది. అతనిపై అయిదు మిలియన్ డాలర్ల క్యాష్ రివార్డ్ను ప్రకటించింది.
భద్రతమండలిలో చైనా అడ్డు..
ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను సమకూరుస్తున్నాడనే కారణంతో 15 సంవత్సరాల పాటు జైలుశిక్షను అనుభవించాడు. అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి గానీ- అది నిజం కాదని ఆ తరువాత తేలింది. అతణ్ని మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలంటూ భారత్-అమెరికా అందజేసిన సంయుక్త ప్రతిపాదనలను ఐక్యరాజ్య సమితి భద్రతమండలిలో చైనా తిరస్కరించింది. దీనిపై ఆమోదం తెలపడానికి నిరాకరించింది.
దిగ్బంధించే వీలు లేకుండా..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో సాజిద్ మిర్ పేరును చేర్చగలిగితే- ఏ దేశం కూడా అతనికి ఆశ్రయాన్ని ఇవ్వదు. తమ దేశ పరిధిలో ఉన్న ఆస్తులను స్తంభింపజేయాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ మీద నిఘా ఉంచుతాయి. ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుంది. ఏ దేశానికి కూడా అతను రాకపోకలు సాగించలేడు. అతన్ని దిగ్భందించడానికి వీలు కలుగుతుంది. తదుపరి చర్యల కోసం అతణ్ని భారత్కు అప్పగించాల్సి ఉంటుంది.
తప్పుపట్టిన స్వామి
అలాంటి కఠిన చర్యలను తీసుకోవడానికి చైనా నిరాకరించడాన్ని తప్పుపట్టారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విషయంలో మోదీపై పరోక్షంగా విమర్శలను గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఉజ్బెకిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం ముగించుకుని మోదీ స్వదేశానికి చెేరిన కొన్ని గంటల్లోనే చైనా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఉగ్రవాదులను తమకు అప్పగించాలంటూ భారత్-అమెరికా చేసిన ప్రతిపాదనలకు చైనా అడ్డుపడిందని పేర్కొన్నారు. మాస్టర్ స్ట్రోక్ కదా.. అంటూ ట్వీట్ చేశారు.