టర్న్: సునంద పుష్కర్ది హత్యా, ఆత్మహత్యా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. సునంద పుష్కర్ విషం వల్ల మరణించినట్లు తేలిందని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డిఎం) అభిప్రాయపడినట్లు పిటిఐ వార్తా సంస్థ కథనం తెలియజేస్తోంది. ఈ స్థితిలో ఆమెది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఆమె శరీరంలోకి విషం ఎలా చేరిందనే కోణంలో దర్యాప్తు చేయాలని కూడా ఎస్డిఎం ఆదేశించారు. నివేదిక వివరాలను వెల్లడించడానికి ఎస్డిఎం ఆలోక్ శర్మ నిరాకరించారు. మోతాదుకు మించిన మందులు తీసుకోవడం వల్ల సునంద పుష్కర్ మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు తమ ఫోరెన్సిక్ నివేదికలో అంతకు ముందు తేల్చారు.
మోతాదుకు మించిన మందులు తీసుకోవడం యాదృచ్ఛికంగా జరగలేదని, కావాలని మోతాదుకు మించిన మందులు తీసుకోవడం వల్లనే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. అయితే, అది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయం తేల్చలేమని వారు చెప్పారు. ఆ విషయాన్ని తేల్చాల్సింది పోలీసులేనని ఆయన చెప్పారు.
సునంద పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ నివేదికను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కు సీల్డ్ కవర్లో అందించారు.