థరూర్ ప్లాన్: సునందకు విడాకులు, తరార్తో పెళ్లి?
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సునంద పుష్కర్ మృతికి ముందే.. ఆమెకు విడాకులు ఇచ్చి పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్ను వివాహం చేసుకోవాలని శశిథరూర్ భావించినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని సీనియర్ పాత్రికేయురాలు, సునంద పుష్కర్ స్నేహితురాలు నళినీ సింగ్ ఢిల్లీ పోలీసులకు తెలిపారు. సునంద పుష్కర్ మృతికి ముందు రోజు, తనను కలిసిందని నళిని చెప్పారు. తనకు విడాకులు ఇచ్చి.. మెహర్ తరార్ను వివాహం చేసుకోవాలని శశిథరూర్ అనుకుంటున్నట్లు సునంద పుష్కర్ తనకు చెప్పిందని ఆమె తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత మెహర్ తరార్ను వివాహం చేసుకోవాలని శశిథరూర్ భావించినట్లు ఆమె చెప్పారు. శశిథరూర్ గత సంవత్సరం జూన్ నెలలో మెహర్ తరార్తో కలిసి మూడురోజులపాటు దుబాయ్లో ఉన్నాడని కూడా సునంద తనకు చెప్పిందని నళినీ పోలీసులకు తెలిపారు. ఇది ఇలా ఉండగా సునంద, శశిథరూర్ తరచూ గొడవ పడుతూ ఉండేవారని వారి పనిమనిషి నారాయణ్ పోలీసులకు తెలిపాడు.
దుబాయ్లో కూడా శశిథరూర్, సునందలు ఘర్షణ పడ్డారని నారాయణ్ చెప్పాడు. జనవరి 15న ఢిల్లీ నుంచి కేరళ వస్తున్న సమయంలో విమానంలో కూడా గొడవపడ్డారని అతడు పోలీసులకు చెప్పాడు. థరూర్ మొబైల్ ఫోన్ సునంద తీసుకోవడంతో ఈ గొడవ మొదలైందని చెప్పాడు. ఢిల్లీలో విమానం దిగిన తర్వాత శశిథరూర్ ఏదో సమావేశం ఉందని వెళ్లగా.. సునంద పుష్కర్ హోటల్కు ఒంటరిగా వెళ్లిందని తెలిపాడు.
వీరిద్దరి వాదనలతో సునంద మృతి కేసు మరో మలుపు తిరిగినట్లయింది. సునంద అనుమానాస్పద మృతికి ప్రధాన అనుమానితుడిగా శశిథరూర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. 2014, జనవరి 18న న్యూఢిల్లీలోని చాణక్య పుటిలోని లీలా ప్యాలెస్ హోటల్లోని రూం నెంబర్ 345లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణం దేశవ్యాప్తంగా ఓ సంచలనం మారింది. కాగా, జులై 1న ఎయిమ్స్ డైరెక్టర్ సుధీర్ గుప్తా కూడా ఇది బలవంతపు మృతిగా.. ఆమె అటాప్సీ రిపోర్టులో తేలిందని చెప్పారు.