మాజీ ఛీఫ్ జస్టిస్ కు సుప్రీంకోర్టు షాక్..! కేంద్రానికి సంచలన లేఖ..!
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసినా ఇంకా ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక బంగ్లాలోనే కొనసాగుతున్న ఓ మాజీ సీజేఐని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సుప్రీం రాసిన లేఖపై కేంద్రం స్పందించే లోపే సదరు మాజీ ప్రధాన న్యాయమూర్తి తనతంట తానే స్పందించి ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన కూడా రిటైర్ కావడంతో సంజీవ్ ఖన్నా స్ధానంలో జస్టిస్ బీఆర్ గవాయ్ కొత్త ఛీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టి కూడా రెండు నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ భారత ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాను మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఖాళీ చేయలేదు.

దీంతో ఆయన తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా అధికారిక బంగ్లాలో నివాసం ఉండే అవకాశం లేకుండా పోయింది. దీనిపై పలుమార్లు ఆయనకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని తెలుస్తోంది. దీంతో చేసేది లేక సుప్రీంకోర్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై లేఖ రాసింది. మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో అధికారిక బంగ్లా ఖాళీ చేయించాలని కోరింది. రిటైర్ అయి ఆరు నెలలు దాటినా ఆయన బంగ్లా ఖాళీ చేయకపోవడాన్ని అందులో ప్రస్తావించింది.
సుప్రీంకోర్టు లేఖపై మాజీ ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక వైద్య పరిస్ధితులతో పాటు వ్యక్తిగత కారణాలతో తాను ఇంకా బంగ్లా ఖాళీ చేయలేదని వివరణ ఇచ్చారు. కేంద్రం ఇప్పటికే తనకు మరో బంగ్లా కేటాయించిందని, దాన్ని సిద్దం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే సీజేఐ అధికారిక బంగ్లా ఖాళీ చేసి అందులోకి మారతానని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications