CJI NV Ramana: ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తులు వీరే: సుప్రీం కొలీజియం రెకమెండ్
అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా మరో ఏడుమంది న్యాయమూర్తులు రానున్నారు. ఏపీతో పాటు మరో రెండు హైకోర్టులకూ న్యాయమూర్తులను అపాయింట్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం వారి నియామకాల కోసం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంది. ప్రస్తుతం 24 మందే ఉన్నారు. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఇందులో ఏడింటిని భర్తీ చేస్తూ సిఫారసులను జారీ చేసింది కొలీజియం.

కర్ణాటక, అలహాబాద్కూ..
ఏపీతో పాటు కర్ణాటక, అలహాబాద్ హైకోర్టులకూ కొత్త జడ్జీల పేర్లను సిఫారసు చేసింది. ఈ రెండు హైకోర్టులకు కలిపి 14 మందిని న్యాయమూర్తులుగా ఎలివేట్ చేసింది. ఇందులో అలహాబాద్ హైకోర్టుకు తొమ్మిది, కర్ణాటక హైకోర్టుకు అయిదుమందిని నియమించింది. ఈ తాజాగా నియామకాలకు సంబంధించిన జాబితాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఆ శాఖాధికారులు దీన్ని ఆమోదించాల్సి ఉంది.

సీజేఐ సారథ్యంలోని కొలీజియం..
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన జాబితాను చాలావరకు న్యాయశాఖ యధాతథంగా ఆమోదిస్తుంటుందనే విషయం తెలిసిందే. ఈ కొలీజియానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వాన్ని వహిస్తున్నారు. అయిదుమంది సభ్యులు ఉన్న కొలీజియం ఇది. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్ రావు ఖన్విల్కర్, జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.

ఏపీ న్యాయమూర్తులు..
ఏపీ హైకోర్టు కోసం సిఫారసు చేసిన వారిలో- అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్, శ్యామ్ సుందర్ బండారు, శ్రీనివాస్ ఊటుకూరు, బొపన్న వరహా లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. వీరు పోగా మరో ఆరు న్యాయమూర్తుల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉంటాయి. వాటిని త్వరలోనే భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు.

కర్ణాటక హైకోర్టు కోసం..
కర్ణాటక హైకోర్టు కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో- అనిల్ భీమ్సేన్ కత్తి, చంద్రశేఖర్ మృత్యుంజయ జోషి, ఉమేష్ మంజునాథ్ భట్ అడిగ, తల్కడ్ గిరిగౌడ శివశంకరె గౌడ పేర్లు ఉన్నాయి. కర్ణాటక హైకోర్టులో ఉండవలసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 62. కాగా 45 మంది పని చేస్తోన్నారు. ఇంకా 17 ఖాళీలు ఉన్నాయి.

అలహాబాద్ హైకోర్టు కోసం
అలహాబాద్ హైకోర్టు కోసం కొలీజియం సిఫారసు చేసిన వారిలో రేణు అగర్వాల్, మహ్మద్ అజర్ హుస్సేన్ ఇద్రిసి, రామ్ మనోహర్ నారాయణ్ మిశ్ర, జ్యోత్స్న శర్మ, మయాంక్ కుమార్ జైన్, శివ్ శంకర్ ప్రసాద్, గజేంద్ర కుమార్, సురేంద్ర సింగ్-ఐ, నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నారు. ఈ సిఫారసులను న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత వారంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications