బోఫోర్స్ కేసులో కాంగ్రెస్కు భారీ ఊరట... సీబీఐ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: బోఫోర్స్ కేసులో కేసులో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట కలిగింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ వాదనను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు మంచి విజయంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
పిటిషన్ దాఖలు చేసేందుకు 13 ఏళ్లు పట్టిందా..?
బోఫోర్స్ కేసులో రూ.64 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పలువురు ప్రముఖులతో పాటు హిందూజా సోదరులు కూడా ఉన్నారు. వీరందరిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్ విచారణ చేసింది. అపీల్ను ఫైల్ చేయడంలో సీబీఐ జాప్యం చేయడంపై కోర్టు ప్రశ్నించింది.అయితే ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అడ్వకేట్ అజయ్ అగర్వాల్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఇందులోనే తమ అభ్యర్థనలను చేర్చాల్సిందిగా న్యాయస్థానం తెలిపింది.
రూ.1437 కోట్లతో హౌఇట్జర్ తుపాకులు కొనుగోలుకు ఒప్పందం
1986, మార్చి 24న భారత్ స్వీడన్కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్తో 400 యూనిట్ల హౌఇట్జర్ తుపాకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు. భారత ఆర్మీని బలోపేతం చేసేందుకు నాడు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాటి ప్రధానిగా ఉన్న రాజీవ్గాంధీకి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి.
కేసు పూర్వపరాలు
2011లో రాజీవ్గాంధీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పువెలువరించింది. 2005లోనే బోఫోర్స్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైనా కేసు కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హిందూజా సోదరులపైనా కూడా కేసు కొట్టేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ కోర్టు 13 ఏళ్ల తర్వా ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అప్పీల్ చేసేందుకు 13 ఏళ్ల సమయం విచారణ సంస్థకు ఎందుకు పట్టిందనే అనుమానం వ్యక్తం చేసింది జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్. సీబీఐ వాదనతో బెంచ్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది.