కోర్టుల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు జరగాల్సిందే: సుప్రీంకోర్టు
కోర్టు గదుల్లో గోప్యత అవసరం లేదనీ, అక్కడ అంత రహస్యంగా విచారించే అంశాలేవీ చోటు చేసుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ: కోర్టు గదుల్లో గోప్యత అవసరం లేదనీ, అక్కడ అంత రహస్యంగా విచారించే అంశాలేవీ చోటు చేసుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సత్వరమే న్యాయ స్థానాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.
మంగళవారం జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యు.యు.లలిత్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ప్రజల విస్తృత ప్రయోజనాలు, క్రమశిక్షణ, భద్రత నేపథ్యంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటును కోరుకుంటున్నట్లు తెలిపింది.
కోర్టు గదులు, ట్రైబ్యునళ్లలో ఆడియో రికార్డింగ్ వసతితో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు అంశంపై సాధించిన ప్రగతిని వివరిస్తూ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని కోరింది.
మరోవైపు.. బ్యాంకుతో నిర్వహించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి.. సర్టిఫైడ్ కానీ ఎలక్ట్రానిక్ రసీదులు వంటి వాటిని కూడా ఆమోదయోగ్యమైన సాక్ష్యంగా పరిగణించవచ్చా? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.