తమిళనాడు జైలుకు శశికళ, వదిలే ప్రసక్తే లేదు: కర్ణాటక ప్రభుత్వం !
బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను చెన్నై జైలుకు తరలించడం అంత సులభం కాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య అన్నారు.
గురువారం ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.
శశికళను చెన్నై జైలుకు తరలించాలంటే సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అయితే తనను చెన్నై జైలుకు తరలించాలని శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే కర్ణాటక ప్రభుత్వం తప్పకుండా కోర్టులో అభ్యంతంరం వ్యక్తం చేస్తుందని న్యాయవాది ఆచార్య స్పష్టం చేశారు.

పరప్పన అగ్రహార జైల్లో శశికళకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి ? ఇక్కడ ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? ఎందుకు చెన్నై జైలుకు వెళ్లాలని అడుగుతున్నారు ? తదితర ప్రశ్నలకు శశికళ సుప్రీం కోర్టులో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య అన్నారు.
జయలలిత అక్రమాస్తుల కేసును ఆచార్య వాదించారు. జయలలిత మరణించడంతో ఈ కేసులోని మిగిలిన ముగ్గురు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు జైలుకు వెళ్లడానికి ఆచార్య కారణం. ఇప్పుడు శశికళ చెన్నై జైలుకు వెళ్లడానికి తన న్యాయవాదులతో కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదే సమయంలో శశికళను ఇక్కడి నుంచి చెన్నై జైలుకు తరలించకుండా అడ్డుకుంటామని, ఆమెకు బెయిల్ కూడా రాదని, కచ్చితంగా బెంగళూరులో జైలు శిక్ష అనుభవించాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆచార్య సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో శశికళ తదితరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాగైనా శశికళను చెన్నై జైలుకు తరలించడానికి ఆమె న్యాయవాదులు విఫలయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications