రేప్ కేసులో ఆశారాంకు బిగ్ రిలీఫ్..!!
Asaram Bapu: అత్యాచర కేసులో యావజ్జీవ కారాగారశిక్షను ఎదుర్కొంటోన్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక వేత్త, బాబా ఆశారాం బాపూనకు బిగ్ రిలీఫ్ లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
2013 నాటి అత్యాచార కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఆశారాం బాపు. ఆయన అసలు పేరు అసుమల్ సిరుమలాణి హర్పలాణి. ఆయన వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. రాజస్థాన్లోని జోధ్పూర్లో గల ఆశ్రమంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు.

ఈ అత్యాచార కేసులో నిందితుడిగా రుజువు కావడంతో 2018లో జోధ్పూర్ న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మరో ఇద్దరు అనుచరులకు 20 సంవత్సరాల పాటు జైలుశిక్ష పడిందప్పట్లో. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా రుజువు అయ్యాయి.
ప్రస్తుతం ఆయన జోధ్పూర్ సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తోన్నారు. కిందటి నెలలో 17 రోజుల పాటు పెరొల్పై విడుడల అయ్యారు. పెరొల్ గడువు ముగియడంతో జనవరి 1వ తేదీన మళ్లీ జైలు అధికారులకు సరెండర్ అయ్యారు. ఇక తాజాగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.
వృద్ధాప్యం మీద పడటం, దాని వల్ల అనారోగ్యానికి గురి కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ ఆశారాం బాపు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలను వినిపించారు. వాదనలను విన్న అనంతరం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేష్ బిందల్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఈ బెయిల్ గడువు మార్చి 31వ తేదీ వరకు ఉంటుంది. బెయిల్పై ఉన్న సమయంలో తన అనుచరులను గానీ, ప్రతినిధులను గానీ కలుసుకోకూడదని సుప్రీంకోర్టు షరతులు విధించింది. పోలీసుల సమక్షంలో వైద్య చికిత్సను తీసుకోవాలని, ఫలానా ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటానంటూ కండిషన్ పెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications