మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు: నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం ఇవ్వాళ మరో మలుపు తిరిగింది. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో అనిశ్చిత, అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్డీవాలా ఆదేశించిన నేపథ్యంలో- అదే సుప్రీంకోర్టులో ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది.
క్లౌడ్ బరస్ట్ కుట్ర కామెంట్స్: కేసీఆర్కు తమిళిసై కౌంటర్
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్డీవాలా నుపుర్ శర్మపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇదివరకు పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్, మాజీ సైనికాధికారులు స్పందించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఏకంగా బహిరంగ లేఖ రాశారు. మొత్తంగా 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్స్, మరో 25 మంది సైనికాధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణకు పంపించారు.
నుపుర్ శర్మపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు. న్యాయస్థానం తన పరిధులను దాటి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందంటూ చెప్పుకొచ్చారు. దేశంలో చోటు చేసుకుంటోన్న అవాంఛనీయ సంఘటనలకు నుపుర్ శర్మ ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొనడం సహేతుకం కాదని అన్నారు.
ఇప్పుడు తాజాగా- అదే సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదివరకే ఎఫ్ఐఆర్ గానీ, ఫిర్యాదులు గానీ నమోదై ఉంటే- వాటికి కూడా తాజా తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆగస్టు 10వ తేదీ వరకు ఆమెపై ఎలాంటి చర్యలు గానీ తీసుకోకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
నుపుర్ శర్మ తరఫున సీనియర్ అడ్వొకేట్ మణీందర్ సింగ్ తన వాదనలను వినిపించారు. ఈ ఏడాది మే 26వ తేదీన టీవీ ఛానళ్లల్లో టెలికాస్ట్ అయిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ పిటీషన్లు దాఖలయ్యాయని, దీనిపై వివరణ సైతం ఇచ్చామని మణీందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై నుపుర్ శర్మపై పలు చోట్ల ఎఫ్ఐఆర్/ఫిర్యాదులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వాదనలను విన్న తరువాత సుప్రీంకోర్టు బెంచ్.. నుపుర్ శర్మకు ఊరట కల్పించింది. ఆగస్టు 10 వరకు చర్యలు తీసుకోకూడదని పేర్కొంది.