Same sex marriage: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది.
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్లో ఉన్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు క్రోడీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ అరుంధతీ కట్జూ తన వాదనలను వినిపించారు.

హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న స్వలింగ వివాహాల గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పిటీషన్లపై విచారణను అయిదు మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి విచారణ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications