వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండొద్దు.. వెంటనే షెల్టర్లకు తరలించండి: సుప్రీంకోర్టు ఆదేశం
సాధారణంగా రోడ్లపై, వీధుల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. జనావాసాల్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీధి కుక్కల వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి కుక్కల వల్ల రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక రాత్రి అయితే వాటి అరుపులు, ఉరుకులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని దిల్లీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దిల్లీలోని వీధి కుక్కలను వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలని ఆదేశించింది. ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి కుక్కలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. దిల్లీలో వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
దేశరాజధాని దిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య పెరగడం ఇటీవల అధికం అయింది. ఉదయం, రాత్రి పూట వాకింగ్ కు వెళ్లేవారిపై, పిల్లలపై వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు అధికం అయ్యాయి. దీంతో ప్రజల్లో రేబిస్ వ్యాధి భయం నెలకొంది. పలువురు కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి. దీంతో ఈ సమస్యను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి తాజాగా సంచలన తీర్పునిచ్చింది. దిల్లీ-ఎన్ సీఆర్ లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ గుర్తించి షెల్డర్లకు తరలించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును 8 వారాల్లోగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక అంశాలను లేవనెత్తింది. కుక్కకాటు వల్ల రేబిస్ తో చనిపోయిన వారిని ఎవరు తిరిగి తీసుకు వస్తారని ఘాటుగా ప్రశ్నించింది. వీధి కుక్కల బెడద కేవలం ఒక అంశం మాత్రమే కాదని.. అది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన ప్రజా భద్రతా సమస్య అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications