సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నుమూత: ఆ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో అత్యవసర చికిత్సను అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోనీ ఓ ప్రకటనలో తెలిపారు.
శాంతనగౌడర్ స్వరాష్ట్రం కర్ణాటక. ధార్వాడ ఆయన సొంత జిల్లా. 1958 మే 5న ఆయన జన్మించారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. 2023 మే 4న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. 1980లో అడ్వకేట్గా తన కేరీర్ను ఆరంభించారు. ధార్వాడ జిల్లా న్యాయస్థానంలో ఏడాది పాటు ప్రాక్టీస్ చేశారు. ప్రత్యేకించి- సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులపై ఆయనకు గట్టి పట్టు ఉంది. 1999-2002 మధ్యకాలంలో కర్ణాటక ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు.

2003 మే 12వ తేదీన కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఆగస్టు 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన తల్లి గత ఏడాది కన్నుమూశారు. ఆమె సమాధి వద్దే తన భౌతిక కాయాన్ని ఖననం చేయాలంటూ జస్టిస్ శాంతనగౌడర్ ఇదివరకే కుటుంబ సభ్యులకు లేఖ రాశారు. వారిది లింగాయత్ సామాజిక వర్గం. లింగాయత్ సంప్రదాయం ప్రకారం ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.












Click it and Unblock the Notifications