కీలక హామీ ఇచ్చిన సుప్రీంకోర్టు.. !!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు- గుజరాత్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జైలు నుంచి విముక్తి కల్పించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీన్ని ఉపసంహరించుకోవాలంటూ నినదించారు. పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. బిల్కిస్ బానో కూడా పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై సుప్రీంకోర్టు తాజాగా కీలక హామీ ఇచ్చింది.

ఉదంతం ఏంటీ?
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు దారుణంగా హతమార్చాయి.

ఆ 11 మంది..
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులైన 11 మంది- రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బోంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.

సత్ప్రవర్తన గల ఖైదీలు..
ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచి పెట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం- వారిని సత్ప్రవర్తన గల ఖైదీలుగా గుర్తించి విడుదల చేసింది. సోమవారమే వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సన్మానించారు. స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు.

సర్వత్రా ఆందోళన..
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అత్యంత దారుణకాండకు పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడాన్ని స్వాగతించట్లేదంటూ పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. ఈ విషయంపై అటు పౌర సమాజం కూడా కదిలింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు పిటీషన్.. విజ్ఞప్తులు
ఆరువేల మందికి పైగా రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వేర్వేరు శాఖల్లో పని చేస్తోన్న ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, చరిత్రకారులు, ఫిల్మ్మేకర్స్, జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపిస్టుల విడుదలపై సీనియర్ అడ్వొకేట్ అపర్ణ భట్ పిటీషన్ దాఖలు చేశారు. మానవ హక్కులతో పాటు సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాలు కూడా ఉల్లంఘనకు గురయ్యాయని పేర్కొన్నారు.

వీలైనంత త్వరగా లిస్టింగ్..
ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అప్పట్లో నోటీసులను సైతం జారీ చేసింది. రేపిస్టులను ఎందుకు జైలు నుంచి విముక్తి కల్పించాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించాలని ఆదేశించింది. దీనిపై విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఆ తరువాత ఈ పిటీషన్ విచారణకు రాలేదు. తాజాగా ఇవ్వాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. వీలైనంత త్వరగా లిస్టింగ్ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అవసరమైన తేదీని తానే స్వయంగా చెక్ చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications