అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పరిశీలిస్తాం: ఈడీకి సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కే్జ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ను మే 7న విచారిస్తామని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి పేర్కొంది.
విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉందని, అందుకే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ నేపథ్యంలోస్పందించిన ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్పందిస్తూ.. మధ్యంతర పిటిషన్ ను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. దీంతో మరింత స్పష్టతనిచ్చిన సుప్రీం ధర్మాసనం.. కేవలం పిటిషన్ను మాత్రమే విచారిస్తామని తెలిపింది. అయితే, బెయిల్ ఇస్తామని చెప్పడం లేదని స్పష్టం చేసింది. చివరకు బెయిల్ ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చని వెల్లడించింది. అయితే, ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్ధమై రావాలని ఈడీకి సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల జరుగుతున్న సందర్భంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు.












Click it and Unblock the Notifications