షాహీన్బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు..అన్నిటిని ఒకేసారి విచారించనున్న ధర్మాసనం
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం షాహీన్బాగ్ నిరసనలపై దృష్టి సారించినట్లుంది. ఈ క్రమంలోనే షాహీన్బాగ్ నిరసనలపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను ఒకేసారి సోమవారం విచారణ చేయనుంది సర్వోన్నత న్యాయస్థానం. ముందుగానే విచారణ చేపట్టాల్సి ఉండగా ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పిటిషన్లను విచారణ చేసేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న షాహీన్బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లను శుక్రవారమే విచారణ చేయాల్సి ఉన్నింది. అయితే ఢిల్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు విచారణకు స్వీకరించి విచారణ చేసి తీర్పు ఇస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఎన్నికల తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏదో సమస్య ఉందని అయితే తమకు అర్థమైందన్న న్యాయమూర్తులు ఇందుకోసం పరిష్కార మార్గం కనుగొంటామని చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం కేసును విచారణ చేస్తామని చెప్పారు జస్టిస్ ఎస్కే కౌల్ మరియు జస్టిస్ కేఎం జోసెఫ్.
ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న ఉన్నందు ఇప్పుడు విచారణ చేసేందుకు అభ్యంతరమేంటని పిటిషనర్ల తరపున న్యాయవాది కోరగా... ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని జడ్జీలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అంతేకాదు షాహీన్బాగ్ నిరసనలపై వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు ఎందుకు విచారణ చేయకూడదో అన్న అంశంపై కూడా ప్రిపేర్ అయి రావాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాదికి న్యాయస్థానం సూచించింది. షాహీన్బాగ్లో ఎక్కువగా నిరసనలు చేపడుతున్నది మహిళలే ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 12న తీసుకొచ్చని భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికీ 55 రోజులకు పైగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.