పెద్ద నోట్ల రద్దు పై సవాల్ : విచారణ పూర్తి -సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు సంచలనానికి కారణమైంది. 2016 నవంబర్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నారు. లక్షలాది మంది పెద్ద నోట్ల మార్పిడి కోసం క్యూ లైన్లలో నిరీక్షించారు. కేంద్రం తమ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను సమర్ధించుకుంది. ప్రతిపక్షాలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన 58 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. జనవరి 2న తీర్పు వెలువరించేందుకు సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి 2న సుప్రీంకోర్టు తీర్పు
పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటీషన్లు దాఖలయ్యాయి. వీటి పైన సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతోంది. 2016 నవంబర్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ నిర్ణయం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారంటూ సుప్రీంలో పిటీషన్లు దాఖలు చేసారు.
ఈ నిర్ణయంలో ఎన్నో లోపాలున్నాయని, దీన్ని కొట్టివేయాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సహా పలువురు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై కొన్నేళ్లుగా విచారణ చేసింది. విచారణ పూర్తి కావటంతో ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 7 న తన రిజర్వ్ చేసిన తీర్పును కొత్త ఏడాదిలో జనవరి 2న వెల్లడించనున్నది.

సమర్ధించుకున్న కేంద్రం..
మాజీ కేంద్ర ఆర్దిక మంత్రి, సీనియర్ న్యాయవాది పీ చిదంబరం పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు. ఇది అత్యంత దారుణమైన నిర్ణయమని ఆరోపించారు. ఈ ప్రక్రియ దేశ చట్టాలను, పాలనను అపహాస్యం చేసిందని విమర్శించారు. సెంట్రల్ బోర్డు సిఫారసుపై మాత్రమే డీమోనిటైజేషన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
కానీ ఈ కేసు అంతా తారుమారుగా ఉందని వాదించారు.అయితే డీమానిటైజేషన్ ను అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమర్థిస్తూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నది సరికాదన్నారు. విస్తృత ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలోనుంచుకుని చూస్తే ఈ ప్రక్రియ విఫలమైందని అనజాలమన్నారు. ఫేక్ కరెన్సీకి, నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చిదంబరంతో పాటుగా శ్యామ్ దివాన్, ప్రశాంత్ భూషణ్ పిటీషనర్ల తరపు వాదనలు వినిపించారు.

తీర్పు వెల్లడించనున్న రాజ్యంగ ధర్మాసనం
విచారణ సమయంలోనే రాజ్యాంగ ధర్మాసనం 2016 నాటి డీమానిటైజేషన్ పాలసీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, రికార్డులను సమర్పించాలని నాటి ఉత్తర్వుల్లో కోర్టు.. కేంద్రాన్ని కోరింది. ఈ ఉత్తర్వుల మేరకు సీల్డ్ కవర్ లో అన్ని రికార్డులను సమర్పిస్తామని అటార్నీ జనరల్ తెలిపారు.రద్దు నిర్ణయం తీసుకుని ఆరు సంత్సరాలు గడిచిపోయినందున, దీనిపై ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై ఆలోచించాల్సి ఉందని బెంచ్ అభిప్రాయపడింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్, బీఆర్ గవాయ్, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్నది. ఈ నెల 7న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ నజీర్ పదవీ విరమణకు ఒక రోజు ముందైన జనవరి 2న వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications