ఈసీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..! బీహార్ ఓటర్ల జాబితాపై వార్నింగ్..!
బీహార్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేవలం రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించే సమయం ఉండదని స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఈసీని ఉద్దేశించి సుప్రీంకోర్టు మరో హెచ్చరిక చేసింది.
బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగినట్లు తేలితే సెప్టెంబర్ లో అయినా దాన్ని పక్కనబెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరికలు చేసింది. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి ఓటు హక్కు కల్పించలేమని ఈసీ చేసిన వాదనను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఐదు కోట్ల మంది ఓటర్లు పౌరులా కాదా నిర్ణయించాల్సింది మీరు కాదని ఈసీకి చురకలు అంటించింది. పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అందులో లోపాల్ని ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలోనే ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఈసీని ప్రశ్నించింది. కానీ ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. అనర్హులైన ఓటర్లను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. కానీ విపక్షాలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.

అదే సమయంలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కర్నాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టారు. అలాగే బీహార్ లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడం విపక్షాలకు ఊరటగా మారింది. ఓట్ల చోరీపై చర్యలు కోరుతూ ఇవాళ వరుసగా రెండోరోజు విపక్షాలు పార్లమెంట్ బయట నిరసనలు తెలిపాయి.












Click it and Unblock the Notifications