ఎందుకు చేయలేదు: ఈసీ నియామకాలపై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్లను నియమించడానికి రాజ్యాంగం ప్రకారం ఎందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను కమిషనర్లు నిర్వహిస్తుంటారని, ఎంతో ప్రాధాన్యం ఉన్న పదవుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాల'ని పేర్కొంది.
ప్రధాన కమిషనర్ (సీఈసీ), కమిషనర్ల (ఈసీ) నియామకానికి రాజ్యాంగంలోని 324(2) అధికరణం ప్రకారం ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉంటుందని తెలిపింది.ఈ విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం.. 'ఇంతవరకు ఎన్నికల కమిషనర్ల నియామకం చాలా చాలా బాగుంది. రాజకీయం తటస్థత పాటించారు' అ'ని పేర్కొన్నది. అయినా పారదర్శకత పాటించేందుకు ఎంపిక ప్రక్రియను రూపొందించడంతో పాటు, మార్గదర్శకాలను ఖరారు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.
కేంద్రం స్పందించకుంటే జోక్యం తప్పదన్న సుప్రీం
1991 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైన టీఎన్ శేషన్.. తన నిర్ణయాలతో అన్ని పార్టీల్లోనూ వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. నాడు ఎన్నికల సంఘం కమిషనర్గా టీఎన్ శేషన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం అప్పట్లో ఏకసభ్య కమిషన్ను త్రిసభ్య కమిషన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్దే తుది నిర్ణయమని కూడా సుప్రీంకోర్టు అప్పట్లోనే తేల్చేసింది. కానీ మరో ఇద్దరు కమిషనర్ల నియామకానికి ఇప్పటివరకు చట్టం లేకపోవడమేమిటని కేంద్రాన్ని తాజాగా నిలదీసింది. లేదంటే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పార్లమెంట్ తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వాదన
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను రాష్ట్రపతి, ప్రధానమంత్రి నియమిస్తారని, ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోవాలని పిటిషనర్ అడగడం సరికాదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇంతవరకు ఎందుకు చట్టం రూపొందించలేదో చెప్పాలని ప్రశ్నించింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల విషయంలో చట్టం చేసిందని రంజిత్ కుమార్ చెప్పగా ఆ విషయాన్ని మరిచిపోండని సరదాగా వ్యాఖ్యానించింది. రంజిత్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ స్వయంగా ప్రధానమంత్రే ఎంపిక చేస్తున్నారని, చట్టం ఉండాలా వద్దా అన్నది పార్లమెంట్ చూసుకుంటుందని తెలిపారు. కానీ ఈ అంశంపై పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ప్రశ్నించొద్దన్నట్లు కేంద్రం వైఖరి కనిపిస్తున్నది.
విపక్ష నేతకు చోటు కల్పించాలని పిటిషన్
వ్యాజ్యం దాఖలు చేసిన అనూప్ పరన్వాల్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ సీఈసీ, ఈసీల నియామకం పారదర్శకంగా ఉండేందుకు చట్టం చేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకానికి లోక్ సభలో విపక్ష నేత సభ్యుడిగా గల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఏర్పాటు ఉండాలని లా కమిషన్, పార్లమెంటరీ సంఘాలు కూడా సిఫారసు చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత చాలా ప్రధానమైనదని, దీని ఎంపిక వ్యవహారాన్ని రాజకీయ, కార్యనిర్వాహకవర్గం చేతిలో పెట్టకూడని తెలిపారు.
నజీం జైదీ స్థానే అచల్ కుమార్ జ్యోతి నియామకం ఇలా
అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు? అర్హుల జాబితాను ఎవరు రూపొందిస్తారు? అర్హులంటే ఎవరు? ఇలాంటి అంశాలపై కచ్చితమైన విధివిధానాలు ఉన్నట్టు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంతముఖ్యమైన వ్యాజ్యంపై కేంద్రం తరఫున డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారి సమాధానం పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు నెలల తర్వాత తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా పనిచేసినప్పుడు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అచల్ కుమార్ జ్యోతి.. తాజాగా నసీం జైదీ స్థానే ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుప్రీంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.