ఎంట్రీ ఇచ్చిన సుప్రీంకోర్టు: ఇరకాటంలో కేంద్రం..!!
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. శుక్రవారం లిస్టింగ్ అయింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేడెక్కాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభల రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. దర్యాప్తు జరిపించడానికి అధికార పార్టీ ససేమిరా అంటోంది. ఎదురుదాడికి దిగుతోంది.

రూ.10 లక్షల కోట్లు..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్.. ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆ కంపెనీ ఆస్తుల విలువ హరించుకుపోతూ వస్తోంది. అపర కుబేరుల జాబితా నుంచి గౌతమ్ అదాని వైదొలిగార. నివేదిక వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే 100 బిలియన్ డాలర్ల మేర అదాని ఆస్తులు క్షీణించాయి.

దర్యాప్తునకు నో..
గౌతమ్ అదానితో ప్రధాని మోదీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులని అందుకే హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించడానికి అంగీకరించట్లేదనేది ప్రతిపక్షాల ఆరోపణలు. వాటిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోంది- 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం మొత్తం కుంభకోణాలు జరియాగంటూ ఎదురుదాడికి దిగుతోంది.

సుప్రీంకోర్టు ఎంట్రీ..
ఈ వ్యవహారం మొత్తం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. హిండెన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు.

రేపే లిస్టింగ్..
ఈ పిటీషన్ పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. శుక్రవారమే లిస్టింగ్ చేసింది. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక వల్ల అదాని సంస్థల్లో షేర్లను కొనుగోలు చేసిన చిన్న ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోయారని విశాల్ తివారీ చెప్పారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉన్న 10 సంస్థలు కూడా ఘోరంగా నష్టపోయాయని గుర్తు చేశారు. ఏ కారణాలతో ఈ నివేదిక ఇచ్చినా.. అందులోని నిజనిజాలను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని రావాల్సి అవసరం ఉందని అన్నారు.

ప్రజాధనం గంగపాలు..
హిండెన్ బర్గ్ నివేదికపై భిన్న కథనాలు వెలువడుతున్నాయని విశాల్ తివారీ వ్యాఖ్యానించారు. ఒకరు దేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తోంటే.. మరొకరు- ఆర్థిక మోసగాళ్ల అసలు గుట్టును ఈ నివేదిక రట్టు చేసిందని చెబుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయం వాస్తవం ఏమిటనేది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దర్యాప్తు జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని అన్నారు. నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications