రండి.. పాతిపెడతాం: పాక్ పై ఆర్మీ చీఫ్ రావత్ సంచలన వ్యాఖ్యలు
భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాకిస్తాన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాకిస్తాన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇండియాస్ మోస్ట్వాంటెడ్' పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా రావత్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ కు పరోక్షంగా రావత్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మరోసారి సర్జికల్ స్ట్రయిక్ జరుపుతామని స్పష్టంచేశారు.
ఉగ్రదాడిలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా గత ఏడాది సెప్టెంబర్ 28-29 మధ్యరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి భారీ సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాలు కొనసాగుతున్నాయని, అవి ఉన్నంతకాలం సీమాంతర చొరబాట్లు తప్పవని అన్నారు. ''చొరబాటుదారుల్ని ఆహ్వానిస్తున్నాం. వారిని భూమిలో రెండున్నర అడుగుల లోతున ఎలా పాతిపెట్టాలో భారత సైన్యానికి బాగా తెలుసు..'' అని రావత్ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కోసం అవసరమైతే మరోసారి సర్జికల్ స్ట్రయిక్ చేపట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని రావత్ వెల్లడించారు. సర్జికల్ స్ట్రయిక్ అనేది మేం వారికి పంపాలనుకుంటున్న సందేశం. దాని అర్థమేంటో వారికి బాగా తెలుసు. అవసరమైతే ఆ దిశగా చర్యలకు సిద్ధమే అని ఆర్మీ చీఫ్ రావత్ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications