మాకు తెలియకుండా 'సేవ్' అయ్యాయి: ఉగ్రవాద అనుమానితుడి భార్య
బెంగళూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఐసిస్ ఉగ్రవాదుల సానుభూతిపరుడిగా అనుమానిస్తూ మొహమ్మద్ అఫ్జల్ అనే వ్యక్తిని, అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అనుమానితుడి భార్య మీడియా సమావేశం నిర్వహించింది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని వాపోయింది.
అఫ్జల్ భార్య, ముష్రమ్ బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడింది. తన భర్త మంచివాడని, ఎలాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టలేదని, అసాంఘిక గ్రూపులతో కలవలేదని చెప్పింది.
అయితే, అనుమానిత ఫోటోలు అంశంపై మాట్లాడుతూ.. అవి అనుకోకుండా తమ మొబైల్ ఫోన్లలో సేవ్ అయ్యాయని చెప్పడం గమనార్హం. అఫ్జల్ అనుమానిత ఫోటోలను ఫేస్బుక్ ద్వారా షేర్ చేశాడు. దీనిపై అడిగితే ఆమె అనుకోకుండా ఫోన్లో 'సేవ్' అయ్యాయని చెప్పింది.
తన భర్త చేసిన తప్పు అదొక్కటేనని వ్యాఖ్యానించింది. తన భర్తను అరెస్టు చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పింది. అఫ్జల్ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు లాప్టాప్, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. అందులో అనుమానిత ఫోటోలు షేర్ చేసి ఉన్నాయి.
హరిద్వార్లో బయటపడిన ఐసిస్ లింక్
హరిద్వార్లో ఐసిస్ లింక్ బయటపడినట్లుగా తెలుస్తోంది. రైలునును పేల్చేందుకు నలుగురు కుట్ర పన్నారు. యూసుఫ్, షఫీని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా వారు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. షఫీ లింకుతో 14 మందిని ఎన్ఏఐ అదుపులోకి తీసుకుంది.
ముంబై, హైదరాబాదులలో పట్టుబడ్డ వారి నుంచి ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు. షఫీ సమాచారంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మంగళూరులలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆన్ లైన్లో పరిచయం పెంచుకొని దాడులకు కుట్ర పన్నుతున్నారు. షఫీ గతంలో ఇండియన్ ముజాహిదీన్లో పని చేశాడు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు చేస్తోంది.