నల్లధనంలో ట్విస్ట్: స్విస్ లిస్ట్లో 5గురు, ఎవరీ స్నేహలతా సాహ్నీ?
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉన్న గుర్జీత్ సింగ్ కొచ్చార్, సయ్యద్ మొహమ్మద్ మసూద్, స్నేహలతా సాహ్నీ, చౌద్ కౌసర్ మహమ్మద్ మసూద్, సంగీతా సాహ్నీల పేర్లను స్విట్జర్లాండ్ బయట పెట్టింది. వివిధ దేశాలకు చెందిన వందమంది పేర్లను తొలుత బయట పెట్టింది.
అందులో ఇద్దరు భారతీయులు స్నేహలతా సాహ్ని, సంగీతా సాహ్నీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత గుర్జీత్, మసూద్, చౌద్ కౌసర్ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ పేర్లు మనకు అంతగా పరిచయం లేని పేర్లు. పేర్లను మాత్రమే బయటకు చెప్పిన స్విట్జర్లాండ్ వారి నల్లధనం వివరాలను మాత్రం చెప్పలేదు. వారికి ఓ అవకాశం ఇచ్చింది. ముప్పై రోజుల్లో ఫెడరల్ పరిపాలనా కోర్టులో అప్పీలును దాఖలు చేయాలని సూచించింది.
ఎవరు వీరు?
గుర్జీత్ సింగ్ కొచ్చార్ కంపెనీస్ ఆప్ వేవ్ గ్రూప్ డైరెక్టర్ అని తెలుస్తోంది. 2012లో కొచ్చార్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఐటీ డిపార్టుమెంట్ వేవ్ గ్రూప్లో సోదాలు నిర్వహించింది.
సయ్యద్ మొహమ్మద్ మసూద్ సిటీ లిమౌసిన్ చైర్మన్. ఇది ముంబై బేస్డ్ కంపెనీ అని తెలుస్తోంది. ఈ కంపెనీ ఈడి స్కానర్లో ఉంది.
స్నేహలతా సాహ్నీ గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె తన భర్తతో కలిపి జాయింట్ అకౌంట్ హోల్డర్ అని తెలుస్తోంది. అతని పేరు భూషన్ లాల్ అని సమాచారం. అతని సాహ్నీ కంపెనీ యజమానిగా తెలుస్తోంది. వారు 1970లో అకౌంట్ తెరిచి ఉంటారని తెలుస్తోంది. 2006లో వారి అకౌంటులో 12.64 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
2012లో అరవింద్ కేజ్రీవాల్ నల్లధనం కలిగి ఉన్న వారి పేర్లను బయట పెట్టాడు. అందులో ప్రవీణ్ సాహ్నీ పేరు ఉంది. ఆ ప్రవీణ్ భార్య సంగీతా సాహ్నీ. భూషణ్, స్నేహలత ప్రవీణ్ తల్లిదండ్రులు.