సుప్రీంకోర్టులో సీజేఐ కేసు విచారణ: న్యాయవ్యవస్థతో ఆటలు వద్దు... భ్రష్టుపట్టించాలని చూస్తున్నారా..?
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వివాదం ముదురుతోంది. న్యాయవ్యవస్థపై ఒక పద్ధతిలో దాడి జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థతో ఆటలు వద్దని దేశంలోని ధనికులకు శక్తిమంతులకు చెప్పేందుకు సమయం ఆసన్నమైందని చెప్పింది. న్యాయవ్యవస్థతో ఆడుకోవడమంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ను లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని చెప్పారు న్యాయవాది. న్యాయవాది వాదనలు విన్న కోర్టు పై విధంగా స్పందించింది. దీనిపై గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్డర్ పాస్ చేస్తామని పేర్కొంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. గత మూడు నాలుగేళ్ల నుంచి న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరమని జడ్జి అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రత్యేక బెంచ్లో జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు జడ్జీలుగా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలు కూడా ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని, పద్ధతి ప్రకారం బురద జల్లుతున్నారని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.