పది సెకన్లలో ముగించేశారు: టిబిల్లుపై వైయస్ జగన్
హైదరాబాద్: కేవలం పది సెకన్లలో మొత్తం తతంగం ముగించేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లోకసభలో తెలంగాణ బిల్లు ప్రతిపాదనపై వ్యాఖ్యానించారు. ఆయన శనివారంనాడు జెడియు అద్యక్షుడు శరద్ యాదవ్తో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహాయం చేయాలని ఆయన శరద్ యాదవ్ను కోరారు.
తమ కూటమిలోని 11 పార్టీలు కలిసి చర్చించుకుంటాయని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని చెబుతామని శరద్ యాదవ్ జగన్తో చెప్పారు. శరద్ యాదవ్తో భేటీ తర్వాత జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తూ శానససభ తీర్మానం చేసినా, కేంద్రం మాత్రం మొండిగా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు.
కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాదని అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. ఈ అంశాలపై తాను శరద్ యాదవ్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. శరద్ యాదవ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఒక్కతాటి మీదికి రావాలని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని జగన్ అన్నారు.
సభలో కాంగ్రెసు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సభలో ఎక్కువ మంది చేతులెత్తితేనే దాన్ని మూజువాణీ ఓటుగా భావించి, బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదంగా పరిగణించాలని, కానీ స్పీకర్ మీరా కుమార్ మాత్రం ఎవరినీ అడగకుండానే పది సెకన్లలో మొత్తం తతంగం ముగించారని ఆన అన్నారు.
నిండు సభలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని, ఈ వ్యవహారాన్ని ఎస్పీ, అన్నాడియంకె, జెడియు సహా అన్ని పార్టీలూ వ్యతిరేకించాయని ఆయన చెప్పారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అన్నారు. తమను సభలో ప్రవేశించకుండా ఐదు రోజులు సస్పెండ్ చేశారని, సీమాంధ్ర ఎంపీలెవ్వరూ సభ లేకుండా చేసి రాష్ట్రాన్ని విభిజించాలని అనుకుంటున్నారని జగన్ అన్నారు. సీమాంధ్ర ఎంపిలెవ్వరూ చర్చలో పాల్గొనకుండా చేయాలన్నదే వారి ఉద్దేశమని, ఇలాంటి అన్యాయం ఎక్కడా జరిగి ఉండదని ఆయన అన్నారు.