తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ
న్యూఢిల్లీ: 18వ లోక్సభలో మంగళవారం కూడా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం తమిళనాడు నుంచి ఎంపీగా గెలుపొందిన కే గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. చివరలో జై తమిళనాడు అని నినాదం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు గోపీకృష్ణ. కాగా, గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన సమయంలోనూ ఆయన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

అంతేగాక, పలు అంశాలపై తెలుగులోనే ప్రశ్నించగా.. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానం ఇచ్చారు. కాగా, గోపీకృష్ణ తెలుగు మూలాలున్న తమిళుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, సోమ, మంగళవారం పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త లోక్సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణాలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్ తెలుగులో ప్రమాణం చేయగా, వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్లో ప్రతిజ్ఞ చేశారు.
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేయగా, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్లో, గోడం నగేశ్ హిందీలో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు పరిశీలించి అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ రాధామోహన్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications