అమ్మకు కోపం: కొడుకు పెళ్లితో పదవి పీకేశారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు కోపం వస్తే వారి పదవులు ఇట్టే ఊడిపోతాయి. వారు ఎంతటి ప్రభావం ఉన్న నాయకులైనా సరే అమ్మ మాట కాదని వెళితే చుక్కలు కనపడతాయి.
కుమారుడి పెళ్లికి ప్రత్యర్ధి వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వచ్చాడని తెలుసుకున్న జయలలిత ఆయనగారి పదవి పీకేశారు. ఏఐఏడీఎంకే తిరునల్వేలి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నారాయణ పని చేస్తున్నారు.
ఆయన ఆ జిల్లాలో బలమైన నాయకుడు. ఇటీవల తన కుమారుడి పెళ్లి జరిపించిన నారాయణ పలువురు సొంత పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెళ్లి రంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖులు పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశిర్వధించారు.
ఈ శుభకార్యానికి పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ హాజరైనారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు పెళ్లికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. విషయం తెలుసుకున్న జయలలిత నారాయణను పదవి నుంచి తప్పించారు.
ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్పా అమ్మ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు సన్నిహితంగా ఉన్న వారిని, పారిశ్రామికవేత్తల మీద అమ్మ దృష్టి పెట్టారు. శశికళ పుష్పతో తూత్తుకుడి జిల్లాకు చెందిన వైకుంఠ రాజన్ సన్నిహితంగా ఉంటారని సమాచారం.
తనకు నచ్చని వారిని, పార్టీకి పనికిరాని పారిశ్రామికవేత్తలను, ఇతర పార్టీల నాయకులను శుభకార్యాలకు పిలిస్తే ఫలితం ఇలా ఉంటుందని జయలలిత మరోసారి నిరూపించారు. మొత్తం మీద కొడుకు పెళ్లి పుణ్యమా అంటూ నారాయణ పదవి ఊడిపోయింది.