అడిగిన బాబు: టితో పాటు తమిళనాడు, కర్నాటకలు
చెన్నై/బెంగళూరు: హుధుద్ తుఫాను వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు పక్కనున్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు సహకరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హుధుద్ పైన స్పందించిన విషయం తెలిసిందే. తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు కూడా తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి.
హుధుద్ తుఫాను వల్ల దెబ్బతిన్న ఏపీకి తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో తుఫాను తీరం దాటిన తరుణంలో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేరకూలాయని, జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభాలు, ఇతర ఉపకరణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 కోట్ల సాయంతో పాటు వంద విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు, ఐదువేల స్తంభాలు, పదివేల ఇన్సులేటర్లతో పాటు ఇతర ఉపకరణాలు అందజేయనున్నట్లు చెప్పారు. సహాయచర్యల్లో పాల్గొనేందుకు తమిళనాడు నుండి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.
హుధుద్ తుఫాను పీడిత ప్రదేశాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు సుమారు రెండు వేల మంది ఇంజినీర్లు, ఇతర సాంకేతిక సహాయ సిబ్బందిని ఏపీకి పంపిస్తామని కర్నాటక విద్యుత్తు శాఖ మంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు.
మధ్యాహ్నం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. తుఫాను బాధిత ప్రదేశాల్లో సహాయక చర్యలకు సాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చేసిన వినతికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారని తెలిపారు.
హుధుద్ విషాదంపై రోశయ్య విచారం
హుధుద్ తుఫాను మిగిల్చిన విషాదం పైన తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సోమవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించడంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
జాతీయ విపత్తు విభాగం, జిల్లా పాలనాయంత్రాంగం, వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, వైద్య రంగం సహాయ పునరావాస చర్యలకు ముందుకు రావడాన్ని ప్రశంసించారు. తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు రోశయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు.