మిస్టరీ: కారులో చెన్నై నవవధువుతో సహ ఆడిటర్ ఫ్యామిలీ సజీవదహనం
రోడ్డు పక్కన కారులో ఒకే కుటుంబంలోని ముగ్గురు సజీవదహనం అయిన సంఘటన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో జరిగింది.
చెన్నై: రోడ్డు పక్కన కారులో ఒకే కుటుంబంలోని ముగ్గురు సజీవదహనం అయిన సంఘటన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో జరిగింది. చెన్నైలోని చిట్లపాక్కంలో నివాసం ఉంటున్న ఆడిటర్ జయదేవన్ (45), ఆయన భార్య రమాదేవి, వీరి కుమార్తె దివ్యశ్రీలు సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు.
జయదవ్ ఆడిటర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య రమాదేవి చిట్లపాక్కంలోని ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. దివ్యశ్రీకి ఇటీవలే వివాహం అయ్యింది. దివ్యశ్రీ భర్త విదేశాలకు వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరే నివాసం ఉంటున్నది.
జయదేవ్ కు మహాబలిపురం సమీపంలోని మనమై ప్రాంతంలో స్థలం ఉంది. ఆ స్థలం చూడటానికి జయదేవ్ భార్య రమాదేవి, కుమార్తె దివ్యశ్రీతో కలిసి వెళ్లారు. స్థలం చూసిన తరువాత ముగ్గురు కారులో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం.
మహాబలిపురం సమీపంలోని మనమై ప్రాంతంలో రాత్రి 9.30 గంటల సమయంలో కారులో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఎడ్వర్డ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే అప్పటికే కారులో ఉన్న ముగ్గురు సజీవదహనం అయ్యారు. కారు నెంబర్ ప్లేట్ ఆదారంగా మృతులను గుర్తించామని పోలీసులు అన్నారు. కారులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏసీ మిషన్ పేలి మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఆడిటర్ జయదేవన్ కుటుంబ సభ్యులకు ఎవరైనా విరోధులు ఉన్నారా ? పాతకక్షలతో ముగ్గురిని సజీవదహనం చేశారా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.