జయ కుళ్లు రాజకీయాలు: వచ్చే వారంలో సుప్రీంకు
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసును వచ్చే వారంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర అన్నారు. మంగళవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.
జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో పలు జాగ్రతలు తీసుకుంటున్నామని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టులో ఈ కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య వాదిస్తారని చెప్పారు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది హరీష్ ను సలహాదారుడిగా నియమించామని వివరించారు. న్యాయవాదుల టీం పరిశీలకుడిగా ప్రముఖ న్యాయవాది సందేష్ ను నియమించామని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండ సుప్రీం కోర్టులో పక్కా ఆదారాలతో సాక్షాదాలు సమర్పిస్తున్నామని మంత్రి జయచంద్ర చెప్పారు.
రాజకీయ కక్షలు!
తమిళనాడు ప్రభుత్వం ద్వేషరాజకీయాలు చేస్తున్నదని మంత్రి టీబీ జయచంద్ర ఆరోపించారు. కావేరి నీటి వివాదం ఎంతో కాలం నుండి జరుగుతున్నదని గుర్తు చేశారు. జయలలిత కేసును సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని తాము ప్రకటించిన తరువాత తమిళనాడు ప్రభుత్వం కుళ్లు రాజకీయాలు చేస్తున్నది ఆరోపించారు.
కావేరి నీటిలో కలుషిత నీరు కలిపి తమిళనాడుకు వదిలి పెడుతున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తమిళనాడు ప్రభుత్వానికి న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర హితవు పలికారు.