మోడీతో జయ భేటీ: 29 డిమాండ్లివే, ఎన్టీఏలో చేరికపై స్పష్టత?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని నివాసానికి వెళ్లిన జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మోడీకి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందించాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్రానికి పార్లమెంటులో అన్నాడీఎంకే మద్దతు, తమిళనాడుకు ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కాగా, మంగళవారం ముఖ్యమంత్రి జయలలిత చెన్నై నుంచి ఢిల్లీలోని తమిళనాడు భవన్కు చేరుకోగానే తమిళనాడు భవన్ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక జయలలిత, ప్రధాని మోడీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంలో చేరనున్నట్లు మీడియాలో వార్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్లో అన్నాడీఎంకే పార్టీ, కూటమిలో చేరితే దేశంలో సంస్కరణల అమలుకు ముందుకు సాగొచ్చని మోడీ స్వయంగా తన మంత్రులతో వ్యాఖ్యానించనట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జయలలితను కూటమిలో చేరాలని మోడీ స్వయంగా ఆహ్వానించవచ్చని, అందుకు ఆమె సైతం నిరాకరించే అవకాశాలు తక్కువేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రధాని మోడీతో జయలలిత భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీకి ఉభయ సభల్లో మొత్తం 50 మందికి వరకు సభ్యులున్నారు.
వీరంతా కూడా ఎన్టీఏకు మద్దతు తెలిపితే ఉభయ సభల్లో బిల్లులు ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని బీజేపీ భావిస్తోంది.