బ్రేకింగ్ : గవర్నర్ ను కలిసిన పళని, ఆ వెనుకే పన్నీర్.. కీలక నిర్ణయం దిశగా గవర్నర్?
గవర్నర్ పిలుపు మేరకు శశికళ వర్గం నేత, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నాయకుడు పళనిస్వామి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఒకరి తరువాత ఒకరు బుధవారం రాత్రి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.
చెన్నై: కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గవర్నర్ పిలుపు అందుకున్న శశికళ వర్గం నేత, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నాయకుడు పళనిస్వామి బుధవారం రాత్రి రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు.
పళనిస్వామి వెంట రాజ్ భవన్ కు వెళ్లిన వారిలో 10 మంది మంత్రులు, ఒక ఎంపీ, ఇతర సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమకు పూర్తి మెజారిటీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరినట్లు సమాచారం.
గవర్నర్ తో భేటీ అనంతరం అన్నాడీఎంకే నేత జయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తగిన నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్లు పేర్కొన్నారు. తాము 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించామని ఆయన పేర్కొన్నారు.
పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు లేరని, అలాంటప్పుడు బలపరీక్ష ఎందుకని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పన్నీర్ వర్గం కూడా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేయాలని కూడా జయ్ కుమార్ డిమాండ్ చేశారు.
గవర్నర్ తో పళనిస్వామి భేటీ అనంతరం.. తనకిచ్చిన అపాయింట్ మెంట్ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం కూడా గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. బలపరీక్షకు తాను సిద్ధమని ఈ సందర్భంగా పన్నీర్ కూడా గవర్నర్ కు విన్నవించినట్లు తెలుస్తోంది.
కీలక నిర్ణయం దిశగా గవర్నర్?
ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన సభలో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేత పళని స్వామిల బల నిరూపణకు గవర్నర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.