హిందీ పాటలు, సినిమాలు, హోర్డింగ్లు నిషేధం?
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం హిందీ వినియోగాన్ని నియంత్రించేందుకు ఓ కీలక బిల్లును నేడు(మంగళవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులో ముఖ్యంగా హిందీ పాటలు, సినిమాలు, హోర్డింగులపై నిషేధం విధించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హిందీ వినియోగాన్ని పరిమితం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.
తమిళ భాష-సంస్కృతి రక్షణకే ఈ చర్య
ఈ ప్రతిపాదిత బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం మంగళవారం రాత్రి నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. అధికార డీఎంకే తీసుకున్న ఈ చర్య.. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ద్రవిడ ఉద్యమం నుంచి వస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని మరింత బలోపేతం చేయనుందిగా పరిగణించబడుతోంది. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ బిల్లు రాష్ట్రంలో హిందీ బోర్డులు, హోర్డింగ్లు, చలనచిత్రాలు, పాటలపై నిషేధం విధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ చర్య తమిళ భాష, సంస్కృతిని రక్షించడానికి అవసరమని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగానే ఉంటుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 343-351 కింద ఆంగ్లాన్ని సహ-అధికారిక భాషగా కొనసాగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

'రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయం'
ఈ బిల్లుపై డీఎంకే సీనియర్ నాయకులు టీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ.. "మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దాన్ని అనుసరిస్తాము. మేము కేవలం హిందీని మాపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము" అని అన్నారు.
బీజేపీ నుంచి విమర్శలు
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు విమర్శించారు. బీజేపీకి చెందిన వినోజ్ సెల్వం ఈ చర్యను తెలివి తక్కువదిగా, అసంబద్ధమైనదిగా అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని ఆయన వాదించారు. ప్రభుత్వ నిర్ణయంపై వినోజ్ సెల్వం మరింత ఘాటుగా స్పందించారు. అధికార డీఎంకే ఇటీవల తిరుప్పరంకుంద్రం, కరూర్ దర్యాప్తు, ఆర్మ్స్ట్రాంగ్ సమస్యలతో సహా అనేక కోర్టు కేసులలో ఎదురుదెబ్బలు తగిలిందని, దీంతో పాటు వివాదాస్పదమైన ఫాక్స్కాన్ పెట్టుబడి సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భాషా వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.
రూపాయి చిహ్నాన్ని కూడా మార్చిన స్టాలిన్ సర్కార్
గతంలో ఈ ఏడాది మార్చిలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం 2025-26 రాష్ట్ర బడ్జెట్లో జాతీయ రూపాయి చిహ్నం (₹) స్థానంలో తమిళ అక్షరం "ரூ" (ru) ను ఉపయోగించింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నాయకులు దీనిని విమర్శించినప్పటికీ, డీఎంకే దీనిని తమిళ సంస్కృతికి గౌరవం ఇవ్వడంలో భాగంగా సమర్థించుకుంది.












Click it and Unblock the Notifications