హెల్మెట్ లేదని బైక్ ను తన్నిన ఇన్స్ పెక్టర్, గర్బిణి మృతి, పోలీసుల దుమ్ములేపారు, జైల్లో!
Recommended Video
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవే రహదారి మీద పోలీసుల అతిగా ప్రవర్తించడంతో ఓ గర్బణి బలి అయ్యింది. హెల్మెట్ వేసుకోలేదని బైక్ మీద వెలుతున్న దంపతులను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి నిండు గర్బిణిని పొట్టనపెట్టుకున్నారు. బైక్ మీద నుంచి గర్భిణి జారిపడి సంఘటనా స్థలంలో దుర్మరణం చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయలైనాయి.
గణేష్ సర్కిల్
తిరుచ్చి- తంజావూరు హైవే రహదారిలోని గణేష్ సర్కిల్ సమీపంలోని బీహెచ్ ఇఎల్ క్వాటర్స్ దగ్గర బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్ మీద అటు వైపు వెళ్లారు. రాజా హెల్మెట్ వేసుకోలేదని అతని బైక్ ను ట్రాఫిక్ పోలీసులు నిలిపడానికి ప్రయత్నించారు.
ఫైన్ వేస్తారని భయం!
రాజా బైక్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో బైక్ లో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ కామరాజ్ రాజా బైక్ ను బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కామరాజ్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా తగిలింది.
ఇన్స్ పెక్టర్ దెబ్బకు బలి
ఇన్స్ పెక్టర్ కామరాజ్ కాలితో బలంగా తన్నడంతో రాజా, ఉష దంపతులిద్దరూ బైక్ మీద నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో సంఘటనా స్థలంలోనే మరణించింది. ఉష భర్త రాజాకు తీవ్ర గాయలైనాయి.
పోలీసు వాహనాలు ధ్వంసం
ట్రాఫిక్ పోలీసుల కారణంగా గర్బిణి ఉష మరణించడంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు తిరుచ్చి-తంజావూరు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
పోలీసుల దుమ్ములేపారు
ఉష కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు దాడి చెయ్యడంతో పలువురు పోలీసులకు గాయాలైనాయి. పరిస్థితి విషమించడంతో అక్కడికి చేరుకున్న తిరుచ్చి డీఎస్పీ ఆందోళనకారులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే చర్చలకు వచ్చిన డీఎస్పీ మీద ఆందోళనకారులు చెప్పులు విసిరి దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.
డీఐజీ విచారణ
ఉష మరణంపై తిరుచ్చి రేంజ్ డీఐజీ నేతృత్వంలో విచారణ జరిపిస్తున్నామని తమిళనాడు పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క తిరుచ్చిలోనే కాదని, ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జైల్లో ఇన్స్ పెక్టర్
నిండు గర్బిణి ఉష మరణానికి కారణం అయిన టాఫ్రిక్ పోలీసు ఇన్స్ పెక్టర్ కామరాజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కామరాజ్ ను సస్పెండ్ చేశామని పైఅధికారులు తెలిపారు. గర్బిణి ఉష మరణానికి కారణం అయిన కామారాజ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, పీఎంకే పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.