7 నెలలుగా వేధింపులు, కౌగిలించుకునే ప్రయత్నం: ఐజీపై మహిళా ఎస్పీ
చెన్నై: తమిళనాడులో ఓ ఐజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఓ మహిళా ఎస్పీ అతనిపై ఫిర్యాదు చేశారు. మహిళా ఎస్పీ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం వెంటనే అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. పలు సందర్భాల్లో ఐజీ తనను లైంగిక వేధింపులకు గురి చేసిన తీరును ఆమె గ్రాఫిక్స్ రూపంలో వెల్లడించారు. చాలాసార్లు ఐజీ తనను కౌగిలించుకున్నారని చెప్పారు.
ఏడు నెలల క్రితం కేసుకు సంబంధించి చర్చ అంటూ
బాధిత మహిళా ఎస్పీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గ్రేటర్ చెన్నై పోలీస్ శాఖలోని ఓ కీలక విభాగంలో డిప్యూటీ కమిషనర్గా ఆ మహిళ పని చేస్తున్నారు. ఇటీవల ఆమె డీజీపీని కలిసి తన విభాగానికి చెందిన ఐజీ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏడు నెలల క్రితం ఓ కేసుకు సంబంధించిన చర్చ నిమిత్తం తనను పిలిచినప్పుడు ఆయన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారని చెప్పారు.
మెచ్చుకునే సాగుతో కౌగిలించుకునే ప్రయత్నం
తాను ప్రతిఘటించినప్పటికీ తరుచూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తనను మెచ్చుకునే సాకుతో కౌగిలించుకోవడానికి ప్రయత్నించారన్నారు. కేసులకు సంబంధించి చర్చ జరిగే సమయంలో తన సెల్ఫోన్లోని సమాచారాన్ని చూపించేవాడని, ఆ కారణంగా అశ్లీల చిత్రాలు కూడా చూపించే ప్రయత్నాలు చేసేవారన్నారు. వాటిని తన సెల్ఫోన్కు పంపించేవారన్నారు.
ఏసీఆర్లో వ్యతిరేకంగా రాస్తానని బెదిరింపులు
ఈ సందర్భంగా తన సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్లు, ఫొటోలను డీజీపీకి సాక్ష్యంగా చూపించారు. తాను అతనికి ఏమాత్రం లొంగలేదని, దీంతో బెదిరింపులకు పాల్పడ్డారని, ఏసీఆర్లో తనకు వ్యతిరేకంగా ఉన్నవి లేనివి రాస్తానని బెదిరించారని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. తెల్లవారుజామునే ఐజీ తనకు ఫోన్ చేసేవారని, అసభ్యకర సందేశాలు పంపించేవారని ఆరోపించారు.
సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు
కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐజీ చెన్నై పోలీసు శాఖలో పలు హోదాల్లో పనిచేసి సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటీని వేసింది. ఈ కేసును స్టేట్ పోలీస్ ఆఫీస్కు చెందిన విశాఖ కమిటీకి ఫార్వార్డ్ చేశారు. కమిటీకి ఏడీజీపీలు సీమా అగర్వాల్, ఎస్యూ అరుణాచలం, డీఐజీ థెనమోళిలను నామినేట్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) టీకే రాజేంద్రన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సరస్వతి, రమేష్లు దర్యాప్తులో భాగం కానున్నారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం కింద దర్యాప్తు చేస్తారు.