అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై రచ్చ-దేశ ఐక్యత దెబ్బతింటోందన్న స్టాలిన్-ఏఆర్ రెహమాన్ కూడా
భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయమైన భారత్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లీష్ లో కాకుండా హిందీలోనే పలకరించుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. షా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీగా కౌంటర్లు పడుతున్నాయి. దీంతో పాటు వివిధ ప్రత్యర్ధి పార్టీల నేతలు,సెలబ్రిటీలు కూడా షా కు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
స్థానిక భాషలకు కాకుండా ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ఇది భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తుందని తమిళనాడు సీఎం విమర్శించారు.
"హోంమంత్రి ఇంగ్లీషులో కాకుండా హిందీలో మాట్లాడాలని చెప్పారని, ఇది భారతదేశ సమైక్యతను దెబ్బతీస్తోందని స్టాలిన్ ట్విట్టర్లో విమర్శించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు సరిపోతాయని హోంమంత్రి మాత్రమే భావిస్తున్నారా? సమైక్యతకు ఒకే భాష సహాయం చేయదని స్టాలిన్ తెలిపారు. బీజేపీ అదే తప్పును పునరావృతం చేస్తోందని, ఈ విషయంలో కాషాయ పార్టీ ప్రయత్నాలు ఫలించబోవని స్టాలిన్ వెల్లడించారు.
స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విడుదల చేసిన ప్రకటన ప్రకారం హిందీ డిక్షనరీని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోం మంత్రి కమిటీకి సూచించారు. కేంద్ర కేబినెట్ ఎజెండాలో 70 శాతం ఇప్పుడు హిందీలో సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు.
షా వ్యాఖ్యలకు తమిళనాడుకే చెందిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. ప్రియమైన తమిళం..' అంటూ భాషాభిమానం ప్రదర్శిస్తూ ఓ ఫొటోను రెహ్మాన్ షేర్ చేశారు. తమిళ దేవతకు చెందిన ఆ ఫొటో ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మూడింటిలోనూ ఆయన షేర్ చేశారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేసిన మనోమణియమ్ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని పదాలను ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్ రెహమాన్. మన ఉనికికి మూలం ప్రియమైన అని 20వ తమిళ కవి భరతిదశన్ రాసిన 'తమిళియక్కమ్' కవితా సంకలనంలోని ఓ లైన్ను ఆ ఫొటోపై క్యాప్షన్గా ఇచ్చారు.