తమిళనాడు మాజీ సీఎం జయలలిత సోదరి మృతి
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోదరి శైలజ జయరామన్ అనారోగ్యంతో మరణించారు. బెంగళూరు నగరంలోని కంగేరి సమీపంలోని రామసంద్రలో నివాసం ఉంటున్న శైలజ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కిడ్ని వ్యాధితో బాధపడుతున్న శైలజ బెంగళూరు నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో గత 20 రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం శైలజ ఆమె నివాసం ఉంటున్న కంగేరి సమీపంలోని రామసంద్రలోని ఇంటిలో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు ? ఎవరెవరు హాజరు అవుతారు అనే విషయాలను శైలజ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
పూజలు చేసి మొక్కులు తీర్చుకుని.................!
అక్రమ ఆస్తుల కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లారు. ఆ సమయంలో శైలజ జైలు దగ్గరకు వెళ్లారు. సోదరి జయలలితను కలవాలని ప్రయత్నించారు. జయలలిత అందుకు అంగీకరించకపోవడంతో శైలజ వెనుతిరిగారు.
జయలలితకు బెయిల్ మంజూరు అయితే మైసూరులోని చాముండి కొండ మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయిస్తానని మొక్కుకున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు అయిన తరువాత శైలజ చాముండి కొండలో ప్రత్యేక పూజలు చేయించి తన సోదరి జయలలిత చల్లగా ఉండాలని కోరుకున్నారు.