శశికళ మిడాస్ మద్యం బంద్, బ్యాంకు లాకర్లపై గురి, ఢిల్లీ అనుమతితో అమ్మ గదిలో సోదాలు !
ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు చెందిన 85 బ్యాంకుల్లోని 250 లాకర్లు తెరచి పరిశీలించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు చెందిన 85 బ్యాంకుల్లోని 250 లాకర్లు తెరచి పరిశీలించేందుకు చర్యలు వేగవంతం చేశారు. శశికళ కుటుంబ సభ్యులకు చెందిన అందర్నీ విచారణ చేసి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు సిద్దం అయ్యారు.
Recommended Video
ప్రధాని మోడీ, జైట్లీ శశికళ ఫ్యామిలీ నాశనం కోరుకుంటున్నారు, ఏంచేస్తారో చూస్తాం: టీటీవీ ఫైర్ !
చిన్నమ్మ శశికళను గురిపెట్టి జరిగిన ఐటీ సోదాలు ఆమె ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహాయకుడు పూంగుండ్రన్ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో ఐటీ శాఖ సోదాలు జరిగాయని తెలిసింది.
అమ్మ జయలలిత గదిలో !
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోని అనేక గదుల్లో ఐటీ శాఖ సోదాలు జరిగినా జయలలిత గదిలో మాత్రం సోదాలు జరగలేదని సమాచారం. జయలలిత ఇంటిలో ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు, విలువైన పత్రాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో లభించిన సమాచారం మేరకు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారణ చెయ్యాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది.
బెంగళూరు కోర్టు అనుమతితో !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారించడానికి ప్రత్యేక బృందం అధికారులు బెంగళూరు కోర్టును ఆశ్రయించనున్నారు. అయితే శశికళ, ఇళవరసిని విచారణ చెయ్యాలని ఇంత వరకు ఐటీ శాఖ అధికారులు మమ్మల్ని సంప్రధించలేదని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.
బ్యాంకు లాకర్లపై గురి
ఐటీ శాఖ సోదాల్లో లభించిన సమాచారాల మేరకు శశికళ ఫ్యామిలీకి సంబంధించిన 250 లాకర్లు పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. బ్యాంకు లాకర్లను తెరిచేందుకు చర్యలు చేపట్టడానికి ఆయా బ్యాంకులకు ఇప్పటికే తనిఖీలకు సంబంధించి ఐటీ శాఖ అధికారులు లేఖలు పంపించారని తెలిసింది.
చిన్నమ్మ ఫ్యామిలీ అక్రమాస్తులు
శశికళ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లలో ఉన్న మరింత అక్రమార్జన గుట్టు బట్టబయలు చెయ్యడానికి ఐటీ శాఖ అధికారులు సిద్దం అయ్యారు. తరువాత ఐటీ శాఖ అధికారులు మరన్ని సోదాలు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ సమాచారం బయటకు రావడంతో శశికళ కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు.
జయలలిత ప్రత్యేక గదిలో !
ఢిల్లీ నుంచి అనుమతి రాగానే పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జయలలిత గది తాళం తీసి పరీశీలించాలని ఐటీ శాఖ అధికారులు సిద్దం అయ్యారు. శశికళ తన అక్రమాస్తుల వివరాలను జయలలిత గదిలో దాచి పెట్టి ఉంటారని ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శశికళకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
కాంచీపురం జిల్లాలోని పడప్పై సమీపంలో శశికళ కుటుంబ సభ్యులకు చెందిన మిడాస్ మద్యం కంపెనీ ఉంది. మిడాస్ కంపెనీలో ఉత్పత్తి అయ్యే బ్రాండ్లన్నీ టాస్మాక్ (తమిళనాడు మార్కెటింగ్ శాఖ) మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఐటీ శాఖ దాడులతో మిడాస్ మద్యం కొనుగోలును టాస్మాక్ వర్గాలు నిలుపుదల చేశాయి. ఈ దెబ్బతో శశికళ కుటుంబ సభ్యుల ఆర్థిక ఆదాయానికి తమిళనాడు ప్రభుత్వం భారీ దెబ్బకొట్టింది.
టీటీవీ దినకరన్ సెటైర్లు
శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ జయలలిత ఇంటిలో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో రహస్యాలు ఉన్నాయా అంటూ సెటైర్లు వేశారు. పెన్ డ్రైవ్ లో వ్యక్తిగత విషయాలతో పాటు ఎలాంటి వివరాలు అయినా పెట్టడానికి అవకాశం ఉందని, ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో ఎలాంటి రహస్యాలు లేవని టీటీవీ దినకరన్ చెప్పారు.