సైరస్ మిస్త్రీకి మరో దెబ్బ: టాటా గ్లోబల్ బేవరేజెస్ నుంచీ ఔట్
న్యూఢిల్లీ: టాటా గ్రూపు నుంచి ఛైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపునకు గురైన మిస్త్రీ.. టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్ బేవరేజెస్(టీజీబీఎల్) నుంచి కూడా ఉద్వాసనకు గురయ్యారు.
సంస్థలోని పదిమంది డైరెక్టర్లల్లో ఏడుగురు ఛైర్మన్గా మిస్త్రీ కొనసాగింపును వ్యతిరేకించారు. టీజీబీఎల్ కంపెనీ ఛైర్మన్గా రతన్ టాటాకు ఆప్తుడు, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరీశ్ భట్ నియమితులయ్యారు.
అయితే సైరస్ మిస్త్రీ సంస్థ బోర్డు సభ్యుడిగా మాత్రం కొనసాగనున్నారు. ఈ విషయంపై మిస్త్రీ స్పందిస్తూ.. టీజీబీఎల్ బోర్డు నిర్ణయం చట్ట విరుద్ధమని, ఓటింగ్ ప్రక్రియలో బోర్డు సభ్యుల ప్రాతినిధ్యం సరిగా లేదని ఆరోపించారు. టాటా గ్రూపు సంస్థల హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్.. అక్టోబర్ 24న సంస్థ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తప్పించింది.
గతవారంలో టీసీఎస్ సారథ్యం నుంచి సైతం మిస్త్రీని తొలగించారు. అంతేగాక, గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, టాటా కెమికల్స్, టాటా మెటార్స్, టాటా స్టీల్ బోర్డులు సైతం ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు వాటాదారుల ఆమోదం కోరనున్నాయి.