ప్రధానిగా నితీశ్ ఓకే- తేజస్వీ యాదవ్ సమర్ధన-మోడీ కాగా లేనిది ఆయనైతే తప్పేంటి ?
బీహార్ లో తాజా రాజకీయ పరిణామాల్లో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ ను ప్రధాని పదవికి సమర్ధిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు. మోడీ ప్రధాని కాగా లేనిది నితీశ్ అయితే తప్పేంటని ప్రశ్నించారు. జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ కు విశేష పాలనా అనుభవం ఉందని, రాజ్యసభ మినహా అన్ని చట్ట సభల్లోనూ సభ్యుడిగా ఉన్నారని, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పుడు ప్రధాని కావాలనుకోవడంలో తప్పులేదన్నారు. ప్రధానిగా మోడీ పనిచేయగా లేనిది నితీశ్ కాలేరా అని తేజస్వీ ప్రశ్నించారు. దేశంలో విపక్షాలను కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్ధలతో టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టిన తేజస్వీ.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్ధల్ని తన ఇంట్లోనే ఆఫీసు తెరుచుకుని కూర్చోమని సవాల్ విసిరారు.
బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు ఆకస్మికంగా జరిగిందేనని, ఇందులో ముందస్తు వ్యూహాలేవీ లేవని మరో ప్రశ్నకు సమాధానంగా తేజస్వీ తెలిపారు. తాము రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని, బీహార్ కు ఇది తక్షణావసరంగా తాము భావించినట్లు తేజస్వి వెల్లడించారు. నితీశ్ చాలా అసౌకర్యంగా కనిపించారని, ఇది అందరూ చూశారని, తాము కూడా దీన్ని గుర్తించి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినట్లు చెప్పారు. బీజేపీకి మిగతా రాష్ట్రాల్లోలా అవకాశం ఇవ్వకూడదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Recommended Video
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలపై స్పందిస్తూ విపక్షాలు ఒక చోట కలిసి కూర్చుని వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, 2024లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా గట్టి అభ్యర్ధిని నిలబెట్టాలని తేజస్వీ యాదవ్ కోరారు. మరోవైపు తన గర్ల్ ఫ్రండ్ రాచెల్ ను పెళ్లి చేసుకున్న ఘటనను తేజస్వీ గుర్తు చేసుకున్నారు. ఆమె క్రైస్తవురాలని, తనతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నానని, చివరికి తండ్రి లాలూకు చెబితే సరేనన్నారన్నారు.