Miss India World టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి మానస వారణాసి: ఎవరీ అమ్మాయి..?
మిస్ ఇండియా వరల్డ్కు జరిగిన పోటీల్లో తెలంగాణకు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. 23 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇంజినీరింగ్ చేసింది. ఇదిలా ఉంటే హరియానాకు చెందిన మానికా షియోకంద్ వీఎల్సీసీ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఇక ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్గా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మాన్యా సింగ్ నిలిచింది.
బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి మానసా వారణాసి మిస్ ఇండియా వరల్డ్ కిరీటంను దక్కించుకుంది. ఈ కాంపీటీషన్కు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుణీ మరియు షేన్ పీకాక్లు వ్యవహరించారు. పేజెంట్ తొలి రౌండ్ను 2019 మిస్ వరల్డ్ ఏషియా సుమన్ రావు ప్రారంభించారు.
హైదరాబాదులో నివాసం ఉంటున్న మానస వారణాసి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్టుగా ప్రస్తుతం పనిచేస్తోంది. డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొంటుంది. ఇక మిస్ ఇండియా వరల్డ్ 2020గా నిలిచిన మానసకు 2019 మిస్ ఇండియా వరల్డ్ సుమన్ రతన్ సింగ్ రావు కిరీటం బహుకరించారు.