తెలంగాణలోను బీజేపీ హవా వచ్చే రోజులొస్తాయి: గెలుపుపై దత్తాత్రేయ
దేశం మొత్తం మోడీ హవా కొనసాగుతుందని, దళితులు, మహిళలను శక్తిమంతులుగా తయారుచేయాలన్నదే ఆయన ధ్యేయమని చెప్పారు.
హైదరాబాద్: యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ప్రత్యర్థి పార్టీలను బీజేపీ చిత్తు చేసింది. ముఖ్యంగా యూపీలో వార్ మొత్తం వన్ సైడ్ అన్న తరహాలో బీజేపీ తన దూకుడు చూపించింది. దాదాపు 315స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ తిరుగులేని శక్తిగా అవతరించే స్థితిలో బీజేపీ ఉంది.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతల్లోను ఆశలు వెల్లివిరుస్తున్నాయి. యూపీలో బీజేపీ విజయంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు లక్ష్మణ్,కేంద్రమంత్రి, ఎంపీ దత్తాత్రేయ బీజేపీ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
యూపీల ఫలితాల నేపథ్యంలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారని గుర్తుచేశారు. అటువంటి వారికి ప్రజలే బుద్ది చెప్పారన్నారు. యూపీ ఫలితాలు మోడీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి చిహ్నాలని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతవాసులు కూడా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
దేశం మొత్తం మోడీ హవా కొనసాగుతుందని, దళితులు, మహిళలను శక్తిమంతులుగా తయారుచేయాలన్నదే ఆయన ధ్యేయమని చెప్పారు. కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలోను బీజేపీకి ఇలాంటి ఫలితాలు వస్తాయని దత్తాత్రేయ అన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని దత్తాత్రేయ జోస్యం చెప్పారు. ఇందుకోసం రానున్న రోజుల్లో బీజేపీ నేతలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు.