తెలంగాణలో బాలికల అదృశ్యం.... బెంగళూరులో ప్రత్యక్షం
బెంగళూరు: ఇంటి నుండి పారిపోయిన ఇద్దరు బాలికలను బెంగళూరు పోలీసులు క్షేమంగా రక్షించారు. బెంగళూరు పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన రాగిణి, రాణి అనే బాలికలను గుర్తించామని సోమవారం పోలీసులు అన్నారు.
ఆదివారం వీరిద్దరు స్నేహితురాలి ఇంటికి వెలుతున్నామని కుటుంబ సభ్యులకు చెప్పారు. తరువాత ఇంటి నుండి బయటకు వచ్చిన వీరిద్దరు అదృశ్యం అయ్యారు. బాలిక కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు గాలించారు.
బెంగళూరు సిటి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు బాలికలను పోలీసులు విచారించారు. బాలికలు చెప్పిన సమాచారం ఆదారంగా నిజామాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. బాలికల కుటుంబ సభ్యులు బెంగళూరు బయలుదేరి వస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరు బెంగళూరు వచ్చారా, ఎవరైనా తీసుకు వచ్చారా అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.