తెలంగాణలో ప్రైవేటు సెంటర్లు, ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్: ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చింది. 45 ఏళ్లు పైబడి, కోవిన్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
అయితే, ప్రైవేటు సెంటర్లు/ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి వ్యాక్సిన్ సరఫరా చేయదు. వారే సొంతంగా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు కరోనా రోగులకు అందించే చికిత్స విషయంలో ప్రభుత్వం పలు సూచనలు చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు.
ఆక్సిజన్ 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే హోం ఐసోలేషన్లో ఉంచాలని ఆయన సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యపై ఆస్పత్రి బయట వివరాలు ఉంచాలని ఆదేశించారు. ఇది ఇలావుండగా, రాష్ట్రానికి సోమవారం 4 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకోగా, తాజాగా 75 వేల కోవాగ్జిన్ డోసులు వచ్చాయి. మంగళవారం రాత్రి వరకు 1.25 లక్షల కోవాగ్జిన్ డోసులు రానున్నాయి.
కాగా, మరోవైపు తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,961 శాంపిల్స్ ను పరీక్షించగా, కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,63,361కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే కరోనా కాటుకు 59 మంది బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2476కు పెరిగింది. తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
సోమవారం ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 7,432 మంది కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 3,81,365కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.30 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంతమంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.