ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నడీ అవార్డుకు ఎంపికైన తెలుగు తేజం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఎమర్జింగ్ గ్లోబల్ లీడర్ అవార్డును 2015వ సంవత్సరానికి గాను తెలుగు తేజం చెరుకూరి తరుణ్ సొంతం చేసుకున్నారు. వ్యక్తులు, సంస్ధలు, ప్రభుత్వాల్లో అర్ధవంతమైన మార్పులు తీసుకొచ్చిన హార్వర్డ్ కెన్నడీ పూర్వ విద్యార్ధులకు ప్రతి ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంటారు.
బిట్స్ పిలానీ, ఐఐఎం బెంగుళూరులో చదువుకున్న తరుణ్ ఆ తర్వాత హిందూస్ధాన్ లీవర్ కంపెనీలో ఉన్నతస్ధాయి ఉద్యోగాన్ని వదులుకుని పేద పిల్లలకు విద్యను అందించేందుకు గాను పూణెలోని టీచ్ ఫర్ ఇండియాలో చేరారు.
ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో పుల్ బ్రైట్ స్కాలర్ షిప్ మీద మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం టీచ్ ఫర్ ఇండియా ఢిల్లీ శాఖకు డైరెక్టర్గా వ్వవహరిస్తున్నారు. దేశంలో పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన వనరులు, సామాజిక వర్గాల అభివృద్ధికి ఇండస్ యాక్షన్ అనే సంస్ధను కూడా నెలకొల్పారు.
దీంతో పాటు ఏకలవ్వ పేరుతో దేశంలోని అన్ని వర్గాలు, మతాలకు చెందిన పిల్లలకు విద్యను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.